
తొక్కిసలాట ఘటనపై బెంగుళూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తొక్కిసలాట గాయపడిన బాధితుడు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. ఆర్సీబీ ఎక్స్ చేసిన పోస్టు చూసి తాను ర్యాలీ కి వచ్చి గాయపడ్డానని ఆర్సీబీ ఫ్యాన్ అయిన బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి తప్పులకు తాను ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదైంది.
READ MORE: Bomb Threat: వేలాది కసబ్లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..
ఇదిలా ఉండగా.. ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేను శుక్రవారం అరెస్టు చేశారు. ముంబయికి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్టు చేసి విచారణకు తరలించారు. నిఖిల్తో పాటు విజయోత్సవ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విజయోత్సవ ఈవెంట్ను కూడా డీఎన్ఏ సంస్థతో కలిసి ఆయనే సమన్వయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.