
అమరావతి, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. మొత్తం ఐదుకోట్ల జనాభాలో 80 లక్షల మంది అంటే సుమారు 17 శాతం. ఈ విషయాన్ని స్వయంగా విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ఒక సమీక్షలో వెల్లడించారు. 15 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న వీరంతా చదవలేని స్థితిలో ఉండటం పై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వయోజన విద్యలో ఆంధ్రప్రదేశ్ స్థానం తక్కువగా ఉండటం దురదృష్టకరమని, ఇకపై దీనిపై మిషన్ మోడ్ లో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఆ – ఆ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం
వయోజన విద్యను ప్రోత్సహించేందుకు ‘‘అక్షర ఆంధ్ర’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఉల్లాస్ కార్యక్రమం కింద 3.95 లక్షల మంది పరీక్ష రాస్తే, 90% పాస్ కావడం హర్షణీయమని చెప్పారు. ఈ నేపధ్యంలో పాఠశాల విద్యాశాఖ నుంచి అంకితభావం గల వారి సేవలను వయోజన విద్యకు మళ్లించాలని సూచించారు. రాష్ట్రం అక్షరాస్యతలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్నదే తాను ఆశిస్తున్న లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
తక్షణ టార్గెట్లు
- వయోజన విద్యా మిషన్ ను తక్షణమే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు
- అక్షరాస్యత పరీక్షల సంఖ్య పెంచాలి
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవులు నిర్వహించాలి
ఈ సమీక్షలో విద్య, స్కిల్లింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఆటిజం కేర్ వంటి అనేక అంశాలపై వివరాల సమీక్ష చేసిన లోకేష్, నూతన మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టారు. “విద్యలో అభివృద్ధి – సమాజంలో శక్తివంతమైన మార్పు” అన్నదే ఆయన ప్రధాన నినాదమని కనిపిస్తోంది. ఇది ఒక వినూత్న దిశలో మొదలైన విద్యా విప్లవం అని చెప్పొచ్చు. అక్షరాలను ఆయుధాలుగా మార్చే “అక్షర ఆంధ్ర” యాత్రకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.