
మళ్లీ కోవిడ్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతొంది.. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు కోవిడ్ విస్తరించింది. దీంతో అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైంది. కేంద్రం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు అలర్ట్స్ జారీ చేసింది. అయితే.. మన ఏపీలోనూ కోవిడ్ భయపెడుతోంది. విశాఖలో ఇప్పటివరకు మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే కుటుంబంలో ఇద్దరికి వైరస్ సోకింది.. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న మరో బాలికకు పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే.. ఈసారి వచ్చే కోవిడ్ వైరస్.. ఓమిక్రాన్ వేరియంట్గా నిర్ధారించారు వైద్యులు. విశాఖలో ఈ సీజన్లో నమోదు అయిన తొలి రెండు కేసుల శాంపిల్స్ను వైరస్ నిర్ధారణ కోసం పూణే ల్యాబ్ కు పంపించారు అధికారులు. అయితే ఆ వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిందని కేజీహెచ్ సూపరింటెండెంట్ టీవీ9తో చెప్పారు.
కోవిడ్ అనగానే చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు చూశాం కదా.. అన్నట్టులే ఉన్నారు. కానీ దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు మాత్రం మళ్లీ ఏదో ముప్పు పొంచి ఉందా అన్న సంకేతాలు లేకపోలేదు. 2025, జూన్ 5వ తేదీ నాటికి దేశంలో 5 వేల కేసులు నమోదు అయితే.. అందులో ఈనెల 4వ తేదీ ఒక్క రోజే భారీగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. ఏపీలోని విశాఖలో నమోదవుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.
14 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్..!
విశాఖలో ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వాటిలో తొలి రెండు కేసులు అంత ఆందోళన చెందే అంశం లేకపోయినప్పటికీ.. మూడో కేసులో 14 ఏళ్ల బాలిక బాధితురాలు. న్యూరో సంబంధ వ్యాధితో కేజీహెచ్లో చేరిన బాలికకు.. సర్జరీ చేసేందుకు సిద్ధమయ్యారు వైద్యులు. ఈ క్రమంలో అన్ని రకాల పరీక్షలు చేశారు. ఈ సమయంలోనే ఆ బాలికకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో అంతా అవాక్కయ్యారు. హుటాహుటిన ఆ బాలికను ఐసోలేషన్ వార్డుకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ‘ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. కోవిడ్ తెలియనప్పటికీ లక్షణాలు అయితే ఆమెలో లేవు.. బ్రెయిన్ ట్యూమర్తో ఆమె బాధ పడుతోంది. సర్జరీ చేసే ముందు ఆమెకు వైద్య పరీక్షలు చేసేసరికి ఆర్టిపిసిఆర్లో పాజిటివ్ తేలింది. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో బాలిక ఉంది’ అని టీవీ 9 తో అన్నారు కేజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ శివానంద.
ఓమిక్రాన్ వైరస్.. ఆ జాగ్రత్తలు..
ఈసారి ప్రబలుతున్న వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్గా నిర్ధారించారు డాక్టర్లు. విశాఖలో నమోదైన మూడు కేసుల్లో రెండు ఇదే వైరస్గా పూణే ల్యాబ్ నిర్ధారించింది. విశాఖలో 14 ఏళ్ల బాలికకు కోవిడ్ ఎటాక్ కావటం.. ఇప్పటికే మూడు కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ‘ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓమిక్రాన్ వేరియంట్ అంత తీవ్రతరం కాదు. అప్రమత్తంగా ఉండాలి.. స్వీయ నియంత్రణ పాటించాలి.. జలుబు, దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దు. నాలుగు రోజులు కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. కరోనా అనుమానం ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు, వయసు మీరిన వారు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.. ప్రస్తుతం విశాఖలో నమోదైన మూడు కోవిడ్ కేసుల బాధితుల్లో ఇద్దరూ ఇప్పటికే కోలుకున్నారు. బాలిక కూడా ఆమెకు ఉన్న అనారోగ్యం తప్ప.. కోవిడ్ తో ఎటువంటి ఇబ్బంది లేదు..’ అని టీవీ9 తో అన్నారు కేజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ శివానంద.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.