. 2 minutes

పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఊతం ఇచ్చి పాల్పడ్డ చర్యలు అమానుషం అని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. పహల్గాంలో ఉగ్రదాడిని ఆయన ప్రస్తావిస్తూ పాకిస్థాన్ ఇన్సానియత్ (మానవతా), కశ్మీరీయత్ (కశ్మీరీవాదం)లపై దాడికి దిగి తన నిజస్వరూపం చాటుకుందని నిరసన వ్యక్తం చేశారు. చినాబ్ నదిపై అత్యంత ఎతైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం తరువాత జరిగిన సభలో శుక్రవారం ప్రధాని మోడీ ప్రసంగించారు. మావనతను మరిచి, పాకిస్థాన్ అండదండలతో ఉగ్రవాదులు పహల్గాంకు వచ్చిన పర్యాటకుల ప్రాణాలను తీశారు. ఈ క్రమంలో మానవత్వం మంటగలిసిందని ప్రధాని తెలిపారు. కశ్మీరీలకు పర్యాటక రంగం ద్వారా రోజు వారి ఉపాధి ఏర్పడుతుంది. వారి జీవనోపాధికి ఈ రంగం కీలకం, అయితే ఈ పర్యాటకానికి తూట్లు పడే విధంగా ఉగ్రవాదులు తూటాలు పేల్చారు.

ఇక ఓ వర్గాన్ని ఎంచుకుని వారి ప్రాణాలు తీయడం ద్వారా మత సామరస్యం దెబ్బతీసేలా చేయడం ఉగ్రవాదుల కుట్ర అని, ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడే ఉగ్రవాదులకు పొరుగుదేశం పాముల పుట్టగా మారిందని ప్రధాని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.పర్యాటక రంగం వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. తరతరాలుగా స్థానికులు పర్యాటక అనుబంధ పనులలో ఉంటూ , తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. అయితే ఈ మూలాలను దెబ్బతీసే విధంగా జరిగిన దాడి క్రమ ంలో కశ్మీరీ కుటుంబాలకు ఎంతటి నష్టం వాటిల్లిందనేది తెలిసిందే. పర్యాటకులను ఎక్కువ సంఖ్యలో లోయలోకి వచ్చేలా చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం, ఈ క్రమంలో పర్యాటకుల సంఖ్య పెరగడం వంటి పరిణామాలతో పాకిస్థాన్ బెంబేలెత్తి ఉగ్రవాదుల సాయంతో ఇక్కడ దాడులకు పాల్పడిందని ఆయన విమర్శించారు. మొత్తం మీద భారతదేశంలో మతపరమైన ఘర్షణలను లేవనెత్తాలని పాకిస్థాన్ భారీ కుట్రకు దిగిందని ప్రధాని తెలిపారు.

పర్యాటకం విలసిల్లితేనే కశ్మీర్‌లోని సగటు పేద మధ్య తరగతి ప్రజల ఇండ్లలో దీపాలు వెలుగుతాయి. వారి వంటశాలలలో పొయ్యిలు పనిచేస్తాయని , మరి ఈ కీలక ఆయువుపట్టు వ్యవస్థను దెబ్బతీసేందుకు యత్నించిన పాకిస్థాన్ చర్య ఏ సభ్య సమాజం మెచ్చుతుందని ప్రశ్నించారు. ఇక్కడి గైడ్‌లు, గుర్రాల స్వారీ పొన్నిలు , గెస్ట్‌హౌస్‌ల యజమానులు, వీటిలో పనిచేసే సిబ్బంది,దాబాల వారు . , షాపుల వారు అంతా కూడా ఈ పర్యాటక రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. వారి జీవితాలలో ఎంతో కొంత వెలుగుకు తోడ్పాటు అందించే పర్యాటకాన్ని వెన్నువిరిచేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని , ఇదేం మానవత్వం ? అని మండిపడ్డారు. ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం భారతదేశం అత్యంత సమర్థవంతం, విజయవంతం అయిన ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. ఇకపై ఉగ్రవాద చర్యలకు పాల్పడితే పాక్‌కు ఈ సైనిక చర్య గుర్తుకు రావల్సిందే. ఈ క్రమంలో చవిచూసిన పరాజయం నెమరేసుకోవల్సిందే అన్నారు.

జమ్మూ కశ్మీర్ మరో మారు రాష్ట్రం కావాలి
ప్రధాని సమక్షంలో ముఖ్యమంత్రి ఒమర్ ప్రస్తావన
జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. చినాబ్ రైలు బ్రిడ్జి ప్రారంభోత్సవం లో ప్రధాని దృష్టికి ఆయన విషయం తీసుకువచ్చారు. ప్రధాన వ్యక్తులు తరలివచ్చిన ఈ సభ ద్వారా తాను వారికి ఈ రాష్ట్రప్రతిపత్తి విషయం తెలియచేస్తున్నానని ఒమర్ చెప్పారు. కశ్మీరీలకు రైలు మార్గం చిరకాల కల అని, ప్రధాని మోడీ హయాంలో ఈ కల నెరవేరిందని ఇక ప్రజల ఆలోచనల్లోని రాష్ట్ర ప్రతిపత్తి కూడా నిజం కావాలని తాను ఆశిస్తున్నానని తెలిపారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.