మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కెటిఆర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కెటిఆర్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కెటిఆర్పై కేసు నమోదైంది. అయితే, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కెటిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్పై ప్రతివాదిగా ఉన్న కెటిఆర్కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కెటిఆర్ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. సుప్రీం జారీ చేసిన నోటీసులపై కెటిఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు మళ్లీ న్యాయ పరంగా కీలక మలుపు తిరి గింది.