. 4 minutes
Top Hedlines 9pm 06 06 2025

పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..!

జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుంచి పి. హరిప్రసాద్ పేరుతో విడుదలైంది.

కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. ఆత్రం సుగుణ పిటిషన్‌పై విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్ , జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ వివాదానికి నేపథ్యం ఇది – ఇటీవల కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 25 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డదని తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా మూసి నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌ను కేంద్రంగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఉట్నూరులో కేటీఆర్‌పై కేసు నమోదైంది.

సింధు జలాల ఒప్పందంపై పాక్ లేఖ.. భారత్ రియాక్షన్..?

సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్‌కు ఇప్పటి వరకు 4 లేఖలను రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా.. మిగతా 3 లేఖలను ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని పలు జాతీయ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ సందర్భంగా భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి ఈ లేఖలు వచ్చినట్లు సమాచారం.

తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం

యాదాద్రి భువనగిరి జిల్లాలో నేడు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలంలో 66 వేల ఆయకట్టు లక్ష్యంగా నిర్మించబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకు స్థాపన చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. గంధమల్లను గత ప్రభుత్వం ఎందుకు పూర్తిచేయలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వంలో యాదాద్రిగా మార్చారని, మేం వచ్చాక మళ్లీ ప్రజలంతా పిలుచుకునే యాదగిరిగుట్టగా మార్చామన్నారు. తిరుమల మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు.

మంత్రి నారా లోకేశ్​ నియోజకవర్గానికి అదనంగా రూ. 111.కోట్లు.. ఎందుకంటే?

మంత్రి నారా లోకేశ్​ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ది పథకం కోసం అదనంగా మరో రూ. 111.కోట్ల కు పైగా నిధుల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు కేటాయింపుల వివరాలతో మున్సిపల్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం గతంలో 21 గ్రామాలకు కలిపి రూ. 450.24 కోట్లతో డీపీఆర్​ను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే యూఐడీఎఫ్ కింద రూ. 287.54 కోట్లు, అమృత్ 2.0 కింద రూ. 51.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇటీవల మరో 15 గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపారు. ఆయా గ్రామాల్లో పైప్ లైన్లు, ట్యాంకుల నిర్మాణం కోసం రూ. 111.50 కోట్లు నిధులు కేటాయింపులు చేశారు. నిధులను సీఆర్​డీఎ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు.. మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు..

ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో నిరక్షరాస్యులు ఉన్నారు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. వయోజనా విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ‘అందరికీ విద్య (వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకం కింద 15 ఏళ్ల వయసు పైబడి ప్రాథమిక విద్యకు నోచుకోనివారు, మధ్యలోనే బడి మానేసి అక్షరాలు మరచిపోయిన వారిని గ్రామస్థాయిలో గుర్తిస్తారు. వీరి విద్యా బోధనకు ఇప్పటికే స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లను వాలంటీర్లుగా ఎంపిక చేశారు. ప్రతిరోజు రెండు గంటల (సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు) పాటు సచివాలయం, అంగన్‌వాడీ కేండ్రాలు, సామాజిక భవనాలు లేదా అందరికీ ఆమోదమైన ప్రదేశంలో విద్యాబోధనకు సిద్ధం చేస్తారు. వీరికి ప్రత్యేక పుస్తకాలు ఉంటాయి. ప్రాజెక్టు కింద చదవడం, రాయడం, సంఖ్యా జ్ఞానం పొందడం, వీడియో రూపంలో బోధన ఉంటుంది.

కేసీఆర్‌కు ఈటల క్లీన్‌చిట్.. బీజేపీ స్టాండ్‌ కూడా ఇదేనా..?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీజేపీ నేత ఈటెల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ మునుపటి నుండి స్పష్టమైన స్థానం తీసుకుందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తప్పు అని జగమెరిగిన సత్యమని, అప్పట్లో ఈటల రాజేందర్‌ కూడా ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆయన అవినీతిపై మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల కమిషన్ ముందు కేసీఆర్ అవినీతి చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారని, అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై ఇంకా స్పందించలేదన్నారు. అదే బీజేపీ అధికారిక వైఖరా అనుకోవాలా? అని ప్రశ్నించారు. ఈటల మాటలు చూస్తుంటే అంతర్గతంగా ఏదైనా ఒప్పందం జరిగిందా అన్న అనుమానం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎలాన్ మస్క్ అక్రమ గ్రహాంతరవాసి.. అమెరికా వదిలి వెళ్లిపోవాలి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ మధ్య బహిరంగ విమర్శలు చేసుకోవడం వరల్డ్ వైడ్ గా ఆసక్తి రేకెత్తిస్తోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు కలిసి తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్‌ బెనాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థను సీజ్‌ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆ అంశంలో తెలంగాణ సహకరించాలి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు. భూ గర్భ జలాలు పెంచు కోవడం పై దృష్టి పెడుతున్నామన్నారు. రిజర్వాయర్ లో నీటి నిల్వలు.. 516 టీఎంసీ వరకు ఉన్నాయని.. ఖరీఫ్ ప్రారంభానికి ముందు కూడా నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. పోలవరం బనకచర్ల అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి పెడుతున్నామని.. భూ సేకరణపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ కు బడ్జెట్ లోటు లేకుండా చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలను తీసుకెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రొజెక్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.. బీఆర్ఎస్ ఇక దెయ్యాల పార్టీ.. డీఆర్ఎస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిర్మలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ వ్యాఖ్యానిస్తూ.. బీఆర్ఎస్ పాలనలో నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారన్నారు. బెయిల్‌పై బయటకి వచ్చాకే కేసీఆర్‌ను కూలదోస్తానని అన్నానని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకొని ఆయనను అధికారంలో నుండి దించామన్నారు.

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.