
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించి సక్సెస్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో వన మహోత్సవం నిర్వహణపై రివ్యూ నిర్వహించారు.
భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం చేపడుతోందని.. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలన్నారు. గౌడ కులస్తులు లబ్ధిపొందేలా చెరువు గట్లు, కెనాల్, ఇతర అవసరమైన ప్రాంతాల్లో ఈత, తాటి మొక్కలు నాటాలని, ప్రభుత్వ స్కూళ్లు, వసతిగృహాల్లో దానిమ్మ, బొప్పాయి, నిమ్మ వంటి పండ్లు, ఇతర ఉపయోగకరమైన మొక్కలను నాటాలని సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్ పోడు భూములు, షెడ్యూల్డ్ తెగలు,- అటవీ శాఖ మధ్య వివాదాస్పద భూముల్లో వెదురు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి పరిరక్షించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.