
సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక అడుగు.. ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు
సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే జోన్) అభివృద్ధికి కేంద్రం కీలక ముందడుగు వేసింది.. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సందీప్ మాధుర్ను జీఎంగా నియమించింది రైల్వే బోర్డు.. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు.. ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్టు సారథిగా ఉన్న సందీప్ మాధుర్ కు సౌత్ కోస్ట్ రైల్వే బాధ్యతలు అప్పగించారు.. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సందీప్ మథూర్కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. దీనికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు జీఎం నియామకంపై ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక అడుగు వేసింది.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది.. సందీప్ మథూర్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా నియమించిందని పేర్కొన్నారు.. రైల్వే కార్యకలాపాలకు నూతన దిశలో వేగవంతమైన పురోగతిగా అభివర్ణించారు.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు కేంద్ర నిర్ణయం అర్థం చెబుతోంది.. ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధిలో కీలక పరిణామం ఇది అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల దీర్ఘకాలకోరికకు ఈ నిర్ణయం న్యాయం చేస్తుందన్నారు.. ఇక, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జీఎం సందీప్ మథూర్కు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు..
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై కేసు నమోదు..
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. సీఎం చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తూ.. వైసీపీ ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే కూడా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.. అయితే, ఈ నేపథ్యంలో పలువురు నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలకలచెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు మొలకలచెరువు పోలీసులు. కానీ, ఈ నిబంధనలను ఉల్లంగించడంతోపాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారని కేసులు పెట్టారు పోలీసుల.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డితో పాటు మరో పదిమందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మొలకలచెరువు పోలీసులు.
ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్..! కూతురు క్రాంతి తీవ్ర ఆవేదన
కాపు ఉద్యమనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్తో బాధపడుతున్నారట.. ఈ విషయం తెలిసి.. తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు.. ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించాడట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి.. “నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో పోరాడుతున్నారు.. కానీ, నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా నాన్నకు అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. ఇటీవల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఒకరు నన్ను నా తండ్రి (ముద్రగడ పద్మనాభం)ని చూడటానికి మంచి ఉద్దేశంతో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, నా సోదరుడు గిరి మరియు అతని మామ.. నా తండ్రిని కలవడానికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నా తండ్రి ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి సమాచారాన్ని తెలియనీయడంలేదు.. దగ్గరి బంధువులకు.. అనుచరులకు కూడా ఈ విషయంపై తాజా పరిస్థితి తెలియని పరిస్థితి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. గిరి, అతని అత్తమామల సన్నిహితులచే మా నాన్న (ముద్రగడ పద్మనాభం) నిర్బంధించబడ్డారు.. ఒంటరిగా ఉంచారు.. నాన్నను సంప్రదించడానికి లేదా మాట్లాడటానికి ఎవరికీ అనుమతి ఇవ్వడంలేదని తెలిసిందన్నారు.. గిరి, ఇది కేవలం అమానుషం కాదు – ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు.. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తే మాత్రం.. నేను ఖచ్చితంగా స్పష్టంగా చెబుతున్నా.. నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు.. మా నాన్న గౌరవం తగ్గకుండగా.. ఆరోగ్య పరిస్థితిపై పారదర్శకమైన సమాచారం ఇవ్వాలని.. సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ట్వీట్ చేశారు క్రాంతి..
బాచుపల్లి సూట్ కేస్ హత్య కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు..
హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు చివరికి ఈ కేసును చేధించారు. ఈ కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మే 23న ఓ యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘోరమైన ఘటన వెనక నేపాల్కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన తోరాను విజయ్ ట్రాప్ చేశాడని తెలిపారు. తోరాకు ఇప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన తోరాను నేపాల్ నుంచి తీసుకొని ఇండియాకు వచ్చాడు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత తోరా ,విజయ్ కాపురం పెట్టారు. కొన్ని రోజుల క్రితమే గర్భము దాల్చింది తూరా. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అబార్షన్ చేయించుకుంటానని విజయ్ పై ఒత్తిడి తెచ్చింది తోరా.
జాగిలాల కోసం ఈత కొలను.. ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
అదిలాబాద్ జిల్లాలో పోలీసులు జాగిలాల కోసం ఓ ఈత కొలను ప్రారంభించారు. జాగిలాలకు వ్యాయామం చేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా వేసవి ఉపశమనంకై ఈత కొలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లాలో 8 జాగిలాలకు ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయగా విధులను నిర్వర్తించి ఈత కొలనులో జలకాలాడి సేద తీరనున్నాయి జాగిలాలు. జాగిలాలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు విధులయందు ఉత్తమ ప్రదర్శనను అందిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జాగిలాల బృందానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈతకొలనును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జాగిలాలు విధులు నిర్వర్తించి సేద తీరడానికి ఈ ఈతకొలను ఉపయోగపడుతుందని తెలిపారు. వేసవికాలంలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వాటి ఆరోగ్యం దృష్ట్యా ఈతకొలనును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా అత్యవసర సమయాలలో నదులలో, వాగులలో తమను తాము కాపాడుకోవడానికి, ఇతరులను రక్షించడానికి జాగిలాలకు ప్రత్యేకంగా ఈత అవసరం ఎంతగానో ఉంటుందని, అలాంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మందస్తు జాగ్రత్తలతో ఈ ఈతకొలను ప్రారంభించి శిక్షణను అందజేయడం జరిగిందని తెలిపారు.
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం జాతికి అంకింతం చేశారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం ప్రధానంగా పర్యాటరంగాన్ని మరింత ఆకర్షించనుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని వందలాది మంది యాత్రికులు దర్శిస్తుంటారు. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో పర్యాటకరంగంగా మరింత పుంజుకోనుంది. ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు. రేపటి నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైళ్లు పరిగెత్తనున్నాయి. ప్రారంభోత్స సమయంలో ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు.
498 కొత్త కరోనా కేసులు.. నలుగురు మృతి!
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య నేటికి ఐదు వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు రాష్ట్రాలలో 4,724 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకు వైరస్తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 498 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్తో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారు కాగా.. కర్ణాటక, పంజాబ్లలో ఒక్కొక్కరు ఉన్నారు. కేరళలో అత్యధికంగా 1,679 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ (615), పశ్చిమ బెంగాల్ (596), ఢిల్లీ (562) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఉన్న విషయం తెలిసిందే.
ఛీ.. ఛీ.. అసలు తల్లేనా..? మైనర్ కూతురిపై 8 సార్లు గ్యాంగ్ రేప్ చేయించి..!
ఉత్తరాఖండ్ హరిద్వార్లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడల్సిన తల్లే కూతురిపట్ల రాక్షసంగా వ్యవహరించింది. తన లవర్ తోపాటు ఇంకొందరితో పదమూడేళ్ల కూతురిపై సామూహిక అత్యాచారం చేయించింది. ఈ దారుణానికి ఒడిగట్టింది మామూలు మహిళకాదు.. బీజేపీ మహిళమోర్చా నాయకురాలు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో ఈమెని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు అనామిక కొన్నాళ్లక్రితం భర్తతో విడిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె తల్లితో.. కుమారుడు తండ్రితో ఉంటున్నాడు. కుమార్తెను తీసుకుని అనామిక.. తన లవర్ సుమిత్ పట్వాల్తో టూర్కు వెళ్లింది. అక్కడ అనామిక అనుమతితో ప్రియుడు సుమిత్, అతని ఫ్రెండ్ శుభం బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈ దారుణం జరిగిందని బాధితురాలు వాంగూల్మం ఇచ్చింది. హరిద్వార్, ఆగ్రా, బృందావన్ సహా ఇలా పలు హోటళ్లలో తనపై ఎనిమిది సార్లు సామూహిక లైంగికదాడి చేశారని తెలిపింది. విషయం తండ్రికి చెబితే తన తల్లి చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. అంతేకాదు, ప్రతీసారి బాలికను లిక్కర్ తాగించి.. అఘాయిత్యానికి ఒడిగట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.. బాధితురాలు నెల పాటు తన తండ్రి దగ్గర ఉండటానికి వెళ్లినప్పుడు ఈ దారుణం బయటపడింది. కూతురిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కంప్లయింట్ చేయించాడు తండ్రి. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై అత్యాచారం, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులకు 14రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ కేసు సంచలనం సృష్టించండతో అనమికాను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.
మూడు వేలు పెరిగిన వెండి.. నేడు తులం బంగారం ఎంతుందంటే?
ఈ వారంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా పెరిగిన పసిడి.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకుంది. వరుసగా నాలుగు రోజులు పెరిగిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,300గా.. 24 క్యారెట్ల ధర రూ.99,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం లక్ష రూపాయలు దాటుతుంది. మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. గత ఐదు రోజులుగా వెండి ధర భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండిపై ఏకంగా రూ.3000 పెరిగి.. రూ.1,07,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,17,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నాగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.1,07,000గా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరలు ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
ఆటగాళ్ల కెప్టెన్గా ఉంటా.. ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదు!
తాను ఆటగాళ్ల కెప్టెన్గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్తో కూడుకున్నదని, ఛాలెంజ్ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నాడు. ‘ప్రస్తుతం భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. మా పేస్ విభాగం పటిష్టంగా ఉంది. తగినంత మంది బౌలర్లు ఉన్నారు. మా ఫాస్ట్ బౌలర్లు ఎలాంటి స్థితిలో అయినా జట్టును గెలిపించగలరు. కెప్టెన్గా నేను ప్రత్యేకమైన శైలిని ఏమీ అనుసరించను. ఆటగాళ్లతో మాట్లాడతా. వాళ్లలో భద్రతా భావాన్ని కలిగిస్తా. ప్లేయర్స్ బలాలు, బలహీనతల గురించి చర్చిస్తా. ఓ కెప్టెన్గా ఇది చాలా ముఖ్యం. భద్రతా భావం కలిగినప్పుడే ఆటగాళ్లు నూరు శాతం కష్టపడతారు. నేను ఆటగాళ్ల కెప్టెన్గా ఉంటా. ఇంగ్లండ్ పర్యటనలో ఓ బ్యాటర్గా జట్టును ముందుండి నడిపించాలనుకుంటున్నా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆడి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టం’ అని కెప్టెన్ శుభ్మన్ గిల్ చెప్పాడు.
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హిట్ మూవీ!
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. సింగిల్ చిత్రం సైలెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే సింగిల్ మూవీ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. సింగిల్కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!
టాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్పై నెలకొన్న వివాదంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ పునరాలోచించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. పర్సంటేజ్ సిస్టమ్లో మార్పుల కోసం పోరాడటం కంటే.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఓటీటీ ట్రెండ్ ఇలానే కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయని, ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని బన్నీ వాసు ట్వీట్ చేశారు. ‘ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల, నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే.. ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉంటాయి. పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది’ అని బన్నీ వాసు ట్వీట్ చేశారు.