
కొంత మంది సినిమాల్లో మాదిరిగా.. నిజ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయని ఊహించుకుంటారు. కానీ అంతా అయ్యాకగాని తత్వం బోధపడదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ఆ మధ్య టాలీవుడ్లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో హీరో మాదిరిగా బ్యాంక్ను మోసం చేయాలని ఓ ఉద్యోగి ప్లాన్ చేసింది. కానీ సినిమాల్లో మాదిరిగా నిజజీవితంలో తప్పించుకోవడం సాధ్యం కాదని తెలియక కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్థాన్లోని కోటాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్.. హాజరైన సీఎం స్టాలిన్!
రాజస్థాన్లోని కోటాలో ఐసీఐసీఐ రిలేషన్షిప్ మేనేజర్ సాక్షి గుప్తా 41 మంది కస్టమర్లకు చెందిన ఫిక్సెడ్ డిపాజిట్ అకౌంట్ల నుంచి రూ.4.58 కోట్లను కాజేసింది. 2020 నుంచి 2023 సంవత్సరాల మధ్య 110 ఖాతాల నుంచి రూ.4.58 కోట్లు లాక్కుంది. కస్టమర్లు ఇచ్చిన ఫోన్ నెంబర్లను మార్చి తన కుటుంబ సభ్యుల నెంబర్లను అప్డేట్ చేసింది. దీంతో ఓటీపీలు, మెసేజ్లు కస్టమర్లకు చేరకపోవడంతో ఎలాంటి అనుమానాలు రాలేదు. అయితే కస్టమర్ల నుంచి దొంగిలించిన డబ్బుంతా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. తీరా చూస్తే ఆ డబ్బుంతా పోగొట్టుకుంది. తీసుకున్న డబ్బును మాత్రం ఆమె తిరిగి డిపాజిట్ చేయలేకపోయింది. కస్టమర్లు డిపాజిట్లు చెక్ చేసుకోగా డబ్బులు లేకపోవడం లబోదిబో అన్నారు. దీంతో బండారం బయటపడి పోలీసులకు చేరింది. అయితే సినిమాలో హీరో తప్పించుకున్నట్టుగా సాధ్యం కాకపోవడంతో మేనేజర్ సాక్షి గుప్తా అండగా బుక్కైంది.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
ఒక కస్టమర్ ఆరా తీయడంతో ఈ యవ్వారం బయటపడింది. ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు అందగా అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతోంది. గురువారం సోదరి వివాహం జరుగుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి గుప్తాను అరెస్ట్ చేశారు. కస్టమర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంకుల్లో కూడా క్షేమం కాకపోతే.. ఇంకెక్కడ దాచుకోవాలని కస్టమర్లు వాపోతున్నారు.