. 2 minutes

India gdp per capita

దేశంలో జిఎస్‌టి (గూడ్స్ అండ్ సర్వీస్ పన్ను) వసూళ్లు బాగా పెరిగాయి. మే నెలలో జిఎస్‌టి వసూళ్లు రూ. 2 లక్షల కోట్లను దాటింది. ఏప్రిల్‌లో జరిగిన లావాదేవీల వల్ల మే నెలలో దాని ఫలితాలు కనిపించాయి. ఆర్థిక అస్థిరత నెలకొన్న పరిస్థితుల్లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలమై ప్రపంచ వాణిజ్యం గందరగోళంలో పడిన తరుణంలో ఈ విధంగా జిఎస్‌టి వసూళ్లు అమాంతంగా పెరగడం ఆశ్చర్యమే. వాణిజ్యం పుంజుకుని దిగుమతుల నుంచి 25 శాతం ఆదాయం పెరిగింది.

జిఎస్‌టి రెండింతలు పెరగడం బలమైన ఆర్థిక కార్యకలాపాలకు, పన్నుల వసూలు వ్యవస్థలో పరిపక్వతకు సంకేతాలుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2025లో భారత్ 7.4 శాతం జిఎస్‌టితో ప్రపంచ నాలుగో ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి జపాన్‌ను అధిగమిస్తుందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) బాహాటంగా ప్రకటించింది. ఇవి గుర్తింపదగిన మైలురాళ్లుగా చెప్పుకున్నప్పటికీ సంపూర్ణ స్థూలదేశీయోత్పత్తి (జిడిపి) ఆధారంగా మాత్రమే పోలికలు ఉంటాయి. కానీ ప్రస్తుత జీవన వాస్తవాలపై జిడిపి పరిమిత అంతర్ దృష్టిని అందిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సంపూర్ణ జిడిపి గణాంకాలు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ సంపద పంపిణీ ఎలా చేయబడుతుందో, దేశం ఎలా అభివృద్ధి చెందిందో, ప్రజలు ఎలా విలవిల్లాడుతున్నారో, తదితర వాస్తవాలను పట్టుకోలేకపోతున్నాయి. జనాభా పరిమాణం, జీవన వ్యయం, ఆదాయ అసమానతలను కప్పిపుచ్చుతున్నాయి.

ఒక దేశం మొత్తం మీద పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండవచ్చు. కానీ అది తప్పనిసరిగా సంపదకు అనుగుణంగా ఉండదు. అలాగే అభివృద్ధి చెందిన జీవన ప్రమాణాలను ప్రతిబింబించదు. ఉదాహరణకు భారత్ సంపూర్ణ జిడిపి (బిలియన్ డాలర్లలో) 2000 సంవత్సరంలో 468.4 బిలియన్ డాలర్ల నుంచి 2025 లో 4,187 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు అంచనా వేయబడింది. ఈ ప్రక్రియలో జపాన్ గణాంకాలను తృటిలో అధిగమించడమవుతోంది. కానీ వాస్తవాలను విశ్లేషిస్తే భారతదేశ తలసరి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి పెర్ కేపిటా) అంటే ఒక సంవత్సరంలో ఒక వ్యక్తికి లభించే సగటు ఆదాయం… 2025లో జపాన్ తలసరి ఆదాయం కన్నా 12 రెట్లు తక్కువగానే ఉంది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి పోలెండ్‌ను మనం పోల్చిచూద్దాం.

దిగువ మధ్యాదాయం నుంచి అధిక ఆదాయ ఆర్థికానికి తరచుగా త్వరితంగా పరివర్తన చెందే దేశంగా ప్రస్తావించబడుతోంది. పోలెండ్ మొత్తం జిడిపి చూస్తే భారత జిడిపి కన్నా నాలుగు రెట్లు చిన్నది. కానీ పరిశీలిస్తే ఆ దేశం తలసరి జిడిపి తొమ్మిది రెట్లు ఎక్కువ. ఆర్థిక వృద్ధి అన్నది దేశ పురోగతికి ముఖ్యమైన సూచిక. అదే విధంగా సామాజిక, విద్య, ఆరోగ్య రంగాలతోపాటు ప్రజాస్వామ్య సూచికలు సాధించిన పురోగతిని అంచనా వేయడం కూడా అంతే ముఖ్యం.ఇవన్నీ వాస్తవ పురోగతిని లెక్కకట్టడానికి అర్థవంతమైన ప్రమాణాలు. రెండు దశాబ్దాల నాటి డేటా ఆధారంగా భారత్, పోలెండ్, జపాన్ దేశాల పురోగతిని పరిశీలిస్తే మొట్టమొదట ఉద్యోగాల స్వభావాన్ని లెక్కలోకి తీసుకోవాలి. 2023 వరకు భారత దేశ శ్రామికశక్తి 45% ఇంకా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటోంది. దీనికి విరుద్ధంగా పోలెండ్, జపాన్ దేశాల్లో ఈ పరిస్థితి 10 శాతం కన్నా తక్కువగా ఉంది.

ఆయా దేశాల్లో పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉద్యోగాలు 10 శాతం మించి పెరిగాయి. ఇక సాధారణ ఉపాధిలో వేతనాలు, జీతాలు పొందే కార్మికుల వాటాను పరిశీలిస్తే ఎవరైతే అధికారిక ఒప్పందాల్లో ఉన్నారో వారు భారత్‌లో 2023లో కేవలం 23.9% మాత్రమే ఉండగా, జపాన్‌లో 91%, పోలెండ్‌లో 80.1% ఉన్నారు. కాలేజీ స్థాయి చదువుల్లో 2022లో భారత్‌లో 32.7% మాత్రమే నమోదు ఉండగా, జపాన్‌లో 65%, పోలెండ్‌లో 75% ఉంది. ఆరోగ్యం విషయంలో భారత్‌లో వ్యక్తి సరాసరి గరిష్ఠ ఆయుర్దాయం 72 ఏళ్లు కాగా, జపాన్‌లో 84 ఏళ్లు, పోలెండ్‌లో 78.5 ఏళ్లుగా ఉంది. ఆరోగ్య సంరక్షణ ఎంతవరకు ప్రాప్తిస్తుందో అన్నది ఆ దేశంలోని శిశు మరణాల రేటును ప్రతిబింబిస్తుంది.

ఏడాది లోపు వయసున్న శిశువుల్లో వెయ్యి జననాల్లో ఎన్ని మరణాలు ఉన్నాయో దానిని బట్టి ఆరోగ్య సంరక్షణను పరిగణించవచ్చు ఆయా దేశాల్లో శిశు మరణాల రేటు 2000 నుంచి 2023 మధ్య కాలంలో సగానికి సగం తగ్గగా, భారత్‌లో ఈ రేటు 24.5 శాతం వరకు ఉంది. జపాన్, పోలెండ్ దేశాల్లో వెయ్యి జననాల్లో ఐదు కన్నా తక్కువ మరణాల రేటు ఉంది. ఇవన్నీ కలిపి మానవ అభివృద్ధి సూచికను ఆయా దేశాల్లో సూచిస్తాయి. ఆరోగ్యం, విద్య రంగాలు, జీవన వ్యయం ఈ విధంగా మొత్తం సాధించిన లక్షాలను మానవ అభివృద్ధి సూచిక కింద పరిగణిస్తారు. ఇది 0 నుంచి 1 మధ్యలో లెక్కిస్తారు. 1 అన్నది ఎక్కువ మానవాభివృద్ధి కింద వస్తుంది.

భారత్ హెచ్‌డిఐ (మానవాభివృద్ధి సూచిక) 2023 లో 0.635 గా చాలా కనీసంగా పరిగణింపబడగా, జపాన్, పోలెండ్‌ల్లో 0.9 మార్కును దాటింది. ఇది ఎక్కువ మానవాభివృద్ధికి సంకేతం. భారత తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ. 1,72,000 కు చేరినట్టు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వచ్చాక దాదాపు 99 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణన లోకి తీసుకుంటే ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయంలో వచ్చిన వృద్ధి చాలా తక్కువని ప్రముఖ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. లసరి ఆదాయం దేశ ప్రజల ఆదాయాల సగటు అని, సగటు ఎప్పుడూ ఆర్థిక అసమానతలను ప్రతిబింబించదని పేర్కొన్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.