
బెంగళూరు, జూన్ 6: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవంలో చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. వీరిలో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా ఉడుమలైకు చెందిన వివేకానంద విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ కామాక్షి దేవి (28) కూడా ఉన్నారు. అవివాహిత అయిన కామాక్షి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి వీరాభిమాని. ఆమె తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. బెంగళూరు రామమూర్తినగర్లో ఉంటూ అమెజాన్ ఇండియా కంపెనీలో పని చేస్తున్నారు. సంఘటన జరిగిన రోజున మధ్యాహ్నం 2.30 గంటలకు క్రికెటర్లను చూసేందుకు కామాక్షి కూడా వెళ్లింది. అయితే ఆ రోజు ఆఫీస్కి వెళ్లిన కామాక్షి క్రికెటర్లను చూసేందుకు మధ్యాహ్నం నుంచి సెలవు కోరి.. షిఫ్ట్ మధ్యలోనే స్టేడియంకి వెళ్లింది.
విరాట్ కోహ్లీ అభిమాని అయిన కామాక్షి ఆన్లైన్లో ఎంట్రీ పాస్లు అందుబాటులో లేనప్పటికీ చిన్నస్వామి స్టేడియంకి బయల్దేరి వెళ్లింది. స్టేడియంలోకి వెళ్లేందుకు పాస్ తీసుకోవాలనే తొందరలో తన ల్యాప్టాప్, బ్యాగ్ను కూడా డెస్క్లోనే వదిలేసింది. మెట్రోలో బయల్దేరిన కామాక్షి.. స్టేడియంకి వెళ్తున్నట్లు మెసేజ్ చేసింది. అదే ఆమె చివరి మెసేజ్. అయితే అనుకోకుండా స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. కామాక్షి మృతి చెందిన విషయం ఓ ఆసుపత్రి నుంచి కాల్ వచ్చిన తర్వాతే తమకు తెలిసిందని కొలిగ్ ఒకరు మీడియాకు తెలిపారు. దీంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నామని అన్నారు. కామాక్షి మృతదేహం గురువారం మధ్యాహ్నం స్వస్థలం ఉడుమలైకు తీసుకొచ్చారు.
తొక్కిసలాటలో పోలీసుల లాఠీచార్జి..
స్టేడియంకి కొంతమంది స్నేహితులతో కలిసి వచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ప్రశాంత్ శెట్టి మాట్లాడుతూ.. మేము RCB జట్టును చూడటానికి వచ్చాము. ఫంక్షన్ కోసం టిక్కెట్లు కొన్నాను. కానీ స్టేడియంలోకి కూడా ప్రవేశించలేకపోయాను. ఇంతలో పోలీసులు అకస్మాత్తుగా అన్ని రోడ్లను బ్లాక్ చేసి, వేదికకు అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేశారు. అకస్మాత్తుగా వారు ప్రధాన ద్వారం దగ్గర లాఠీ ఛార్జ్ చేయడం ప్రారంభించారు. మేము ఏం తప్పు చేసామో అప్పులు మాకు అర్ధం కాలేదు. అభిమానుల్ని ఫంక్షన్ కి ఆహ్వానించారు. మేం టిక్కెట్లు కొన్నాం. కానీ చివరికి లాఠీలతో కొట్టారు. దుర్భాషలాడారు. మాలాంటి అది నిజంగా అభిమానులకు భయంకరమైన రోజని ప్రశాంత్ శెట్టి అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.