
అఫ్గానిస్థాన్లో ఓ అరుదైన ఘటన వెలుగుచూసింది. ఘోర్ ప్రావిన్సు అల్లా యార్ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరపుతుండగా ఓ పురాతన కలశం బయటపడింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా గురిడ్ సామ్రాజ్య కాలానికి చెందిన 60 బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలు మట్టితో చేసిన ఒక కలశంలో దొరికాయి. వీటిలో కొన్ని నాణేలు డ్యామేజ్ అయ్యాయని.. ఘోర్ ప్రావిన్సు సమాచార, సాంస్కృతిక విభాగం డైరెక్టర్ అబ్దుల్హై జయం తెలిపారు. అయితే ఈ నాణేల చారిత్రక లేదా ఆర్థిక విలువపై ఇంకా పూర్తి అంచనాకు రాలేదన్నారు.
గురిడ్ సామ్రాజ్యం 786 నుంచి 1215 ఏడీ మధ్య ఆధునిక అఫ్గానిస్థాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఏలింది. ఫిరోజ్కోహ్ (ప్రస్తుతం ఘోర్ ప్రావిన్సు రాజధాని) ఈ సామ్రాజ్యానికి కేంద్ర బిందువుగా ఉండేది. ఈ రాజవంశం ఇస్లామిక్ నిర్మాణ కళ, వాణిజ్యం.. పర్షియన్ సంస్కృతిని దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాల అంతట విస్తరించింది. దొరికిన బంగారు నాణేలు చారిత్రక ప్రాముఖ్యత కలిగినవి అని.. కానీ వాటి ఖచ్చితమైన విలువను నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరమని అబ్దుల్హై జయం తెలిపారు. ఈ నాణేలు దేశ చారిత్రక సంపదలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Unearthed Gold Coins
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..