
45 ఏళ్ల కిందట కట్టిన శ్రీశైలం రిజర్వాయర్ను 30 ఏళ్లుగా ఒక సమస్య వేధిస్తోంది. ఇప్పుడది ముదిరి.. డ్యామ్ భద్రతనే సవాల్ చేస్తోంది. ఇదే భారీ గొయ్యి. శ్రీశైలం రిజర్వాయర్ ఫ్యూచర్ని సందేహాస్పదంగా మారుస్తోంది. వరుసబెట్టి నిపుణులు రావడం.. పరిశీలించడం.. నివేదికలివ్వడం.. వెళ్లడం. ఇప్పుడు CWPR సైంటిస్టుల వంతొచ్చింది. ఇంతకీ శ్రీశైలం డ్యామ్ భద్రమేనా? ప్లంజ్ పూల్ సమస్యకు తెర పడే మార్గమెక్కడ..? అన్నదీ చర్చనీయాంశంగా మారింది.
శ్రీశైలం రిజర్వాయర్.. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన జలాశయాల్లో ఒకటి. లక్షలాది ఎకరాల సాగుకు ప్రధాన ఆధారమైన కీలకమైన ప్రాజెక్టును ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది ఫ్లంజ్ పూల్ సమస్య. దీంతో భవిష్యత్తులో డ్యామ్ భద్రతకే ప్రమాదం తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ నేతృత్వంలో స్పెషల్ టీమ్ వచ్చి శ్రీశైలం జలాశయాన్ని పరిశీలిస్తోంది. అత్యవసరంగా చేపట్టవలసిన పనులపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జలాశయంపై దృష్టి సారించింది. ప్లంజ్ పూల్ సమస్యకు సంబంధించి సర్వే కోసం 14.7 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసింది. ఇటు.. డ్యామ్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ జలాశయాన్ని సందర్శించి.. ప్రస్తుతం డ్యామ్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భరోసా ఇచ్చింది. కానీ.. డ్యామ్ ముందు భాగంలో 12 సిలిండర్లు దెబ్బతిన్నట్టు గుర్తించి.. వాటిని రీప్లేస్మెంట్ కోసం ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తల బృందం సభ్యులు డ్యామ్ను పరిశీలిస్తున్నారు. ప్లంజ్ పూల్పై మ్యాథమెటికల్ సర్వే ద్వారా లోతును, వెడల్పును కొలుస్తున్నారు.
అసలేమిటీ ప్లంజ్ పూల్…?
అసలేమిటీ ప్లంజ్ పూల్…? శ్రీశైలం డ్యామ్ ఉనికిని ఎందుకు సవాల్ చేస్తోంది..? భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలో లోతైన గుంత పడింది. గేట్లు ఎత్తినప్పుడు నీటి ప్రవాహానికి అడ్డంగా భారీ గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారుతుంది. ఈ తరహా గొయ్యిని ఇరిగేషన్ భాషలో ఫ్లంజ్ పూల్ అని పిలుస్తారు. 45మీటర్ల లోతు.. 270 వెడల్పు.. 400 అడుగుల పొడవున విస్తరించింది. 1996లో వచ్చిన భారీ వరదలతో ఏర్పడిన గొయ్యి ఆ తర్వాత.. 2009 నాటి వరదలతో మరింత విస్తరించింది. 25 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో శ్రీశైలం డ్యామ్ ఓవర్ఫ్లో అవ్వడం అప్పట్లో సంచలనమైంది.
శ్రీశైలం డ్యామ్ గేట్ల ముందు ఏర్పడిన ఈ గొయ్యి పునాదుల వరకు విస్తరిస్తే.. డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నది నిపుణుల ఆందోళన. సీడబ్ల్యుసీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంస్థలు సైతం ఈ మేరకు రిపోర్టులిచ్చాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..