
మన శరీరంలో సుమారుగా 60 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ లాంటి సమస్యలకు కూడా తగినంత నీరు తాగకపోవడం ఒక కారణం కావచ్చు.
1 నుంచి 8 ఏళ్ల వయస్సు పిల్లలకు రోజుకు సుమారుగా 1.3 నుంచి 1.7 లీటర్ల మధ్య నీరు అవసరం. వారు చురుకుగా ఆడుకుంటారు కాబట్టి శరీరం తేమగా ఉండడం కోసం తగినంత నీరు తాగించాలి.
9 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు విద్యార్థులు రోజుకి కనీసం 2 నుండి 2.5 లీటర్లు నీరు తాగాలి. చదువులో శ్రద్ధ పెట్టడానికి, శరీరంలో శక్తిని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వారు రోజుకి 2.5 నుండి 3 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు.. ఎక్కువ వేడి వాతావరణంలో పనిచేసే వారు మరింత నీరు తాగాలి. ఇది శరీరంలోని నరాల పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మహిళలు నెలసరి లేదా గర్భధారణ సమయంలో హార్మోన్లలో తేడాలు కనిపించడం సహజం. ఈ సమయంలో శరీరానికి ద్రవ పదార్థాల అవసరం పెరుగుతుంది. అందువల్ల రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తాగడం ద్వారా శరీరంలో డీహైడ్రేషన్ ను నివారించవచ్చు.
60 ఏళ్లు పైబడినవారు.. వయస్సు పెరిగే కొద్దీ దాహం అనిపించే స్వభావం తగ్గిపోతుంది. అందుకే తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం రోజుకు 1.5 నుండి 2 లీటర్ల వరకు నీరు తాగడం మంచిది. దాహం అనిపించకపోయినా కొన్ని గంటలకొకసారి తాగే అలవాటు చేసుకోవాలి.
ఒక సాధారణ నియమం ప్రకారం.. ప్రతి కిలో శరీర బరువుకు కనీసం 30 మిల్లీలీటర్ల నీరు అవసరమవుతుంది. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి దాదాపు 1.8 లీటర్ల నీరు అవసరం.
నీరు తాగడానికి సరైన సమయాలు
- ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్.
- భోజనానికి 30 నిమిషాల ముందు.
- వ్యాయామం తర్వాత.
- పడుకునే ముందు కొద్దిగా నీరు.
ఈ సమయాల్లో నీటిని తాగడం ద్వారా శరీరానికి తగిన తేమ అందుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)