
CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఒక గుర్తుతెలియని వ్యక్తి ప్రాణహాని బెదిరింపు కాల్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె భద్రతను శుక్రవారం అధికారులు మరింతగా పెంచారు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో పోలీస్ కంట్రోల్ రూమ్కు గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి ఈ బెదిరింపు చేసినట్టు ఘాజియాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
బెదిరింపు కాల్ చేసిన తర్వాత ఆ కాలర్ తన మొబైల్ ఫోన్ను వెంటనే ఆఫ్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఘాజియాబాద్ పోలీస్ ఇంటర్-స్టేట్ కోఆర్డినేషన్ సెల్, ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. టెలికాం కంపెనీ సహాయంతో బెదిరింపు ఇచ్చిన ఫోన్కు సంబంధించిన సిమ్ యజమానిని పోలీసులు గుర్తించినప్పటికీ, గురువారం రాత్రి 11 తర్వాత ఆ ఫోన్ను ఎవరూ ఆన్ చేయలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!
ఈ బెదిరింపు తర్వాత సీఎం రేఖా గుప్తా పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడాన్ని పరిమితం చేసే అవకాశం కనపడుతోంది. ఆమెకు ఏర్పాటు చేయబడ్డ సెక్యూరిటీని మరింత బలపరిచినట్లు సమాచారం. ఇకపోతే, ఢిల్లీ ముఖ్యమంత్రులపై బెదిరింపులు, దాడులు ఇది కొత్తకాదు. 2019లో అప్పటి సీఎం అర్వింద్ కేజ్రీవాల్పై ఒక ఆటో డ్రైవర్ దాడి చేశాడు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆ వ్యక్తి ఆరోపించాడు. అంతకుముందు 2016లో ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో కేజ్రీవాల్పై బ్లాక్ ఇంక్ విసిరారు. అంతేకాకుండా 2025 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో సావిత్రి నగర్లో కేజ్రీవాల్పై ద్రవ పదార్థం విసిరిన ఘటన కలకలం రేపింది.