అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలో 45 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని వినియోగించినట్లు రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ సముదాయంలోని మొదటి అంతస్తులో రామ్ దర్బార్ పవిత్రీకరణ జరిగిన మరునాడు శుక్రవారం మిశ్రా ఈ విషయాన్ని తెలిపారు. మందిర నిర్మాణంలో ఉపయోగించిన బంగారం విలువ పన్నులు లేకుండా రూ. 50 కోట్లు ఉంటుందన్నారు. మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో ద్వారాలకు బంగారాన్ని విస్తృతంగా వాడారు. అంతేకాక రామ ప్రభువు సింహాసనానికి కూడా బంగారాన్ని వాడారు. శేషావతార్ మందిరంలో ఇప్పటికీ బంగారపు నగిషీ పని జరుగుతోందని ఆయన వివరించారు. రామ దర్భార్ పవిత్రీకరణ తర్వాత జనులు దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. అయితే పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. రామ మందిర పవిత్రోత్సవంకు ఆలయ గర్భగుడి వద్దకు పెద్ద సంఖ్యలో జనులు వచ్చారు.
కాగా రామాలయ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ ఆలయంలో గురువారం ఏడు విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిందన్నారు. ఆయన ఇంకా పవిత్రోత్సవంలో గర్భ గుడిలో రామ దర్బార్, ఈశాన్యంలో శివ లింగం, ఆగ్నేయంలో గణపతి విగ్రహం, దక్షిణాన మధ్యలో హనుమంతుడి విగ్రహం, నైరుతిలో సూర్యుడి విగ్రహం, వాయువ్యంలో భగవతి, ఉత్తరాది దిక్కున మధ్యలో అన్నపూర్ణ మాతా విగ్రహాలను ప్రతిష్టించినట్లు ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఎండ వేడిని తట్టుకునేందుకు ఎలాంటి షీల్డ్ పెట్టనందుకు చాలా మంది ఎండకు ఇబ్బంది పడ్డారని సమాచారం. ఇదిలావుండగా కొత్తగా పవిత్రీకరించిన రామ దర్బార్ను సాధారణ ప్రజానీకానికి ఇంకా తెరువలేదని రామ మందిర ట్రస్ట్ అధికారి స్పష్టీకరించారు. జనవరి 22న ప్రధాని మోడీ సమక్షంలో రామ్ లల్లా విగ్రహ పవిత్రీకరణ తొలిసారి జరిగింది. అయితే గురువారం జరిగిన పవిత్రీకరణోత్సవం మందిరంలో రెండో అతి పెద్ద వేడుక.